శీతాకాలంలో లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. సీతాఫలం అనేక రకాల పోషకాల సమాహారం.ఈ కాలంలో మూడు నెలలకు పైగా సీతాఫలం లభిస్తుంది. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది.
సీతాఫలంలో కెరోటిన్, థయామిన్ , రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు ఎముకల పుష్టికి తోడ్పడతాయి.
- మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
- హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
- డైటింగ్ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు.
- పండులోని సల్ఫర్ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది.
- సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది.
- నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికం ఈ పండుకు. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది
సీతాఫలం పండే కాదు.. ఆకులు కూడా మనకు కొన్ని నివారణకు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్తెనిక్ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.
ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే ఉపశమనం ఉంటుంది.
ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే.. నల్లుల బెడద ఉండదు.
జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది.మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో ఉండే చక్కెరల శాతం చాలా ఎక్కువ. ఉబ్బసం రోగులు వైద్యుల సలహా తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.